సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నుండి పదవీ విరమణ పొందిన కార్మికులకు సమగ్ర పెన్షన్ ప్యాకేజీని అందించాలని కోరుతూ, సింగరేణి రిటైర్మెంట్ కార్మికుల వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు గోలేటిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) బ్రాంచ్ మేనేజర్ను కలిసి వినతి పత్రం సమర్పించారు.
సింగరేణి రిటైర్మెంట్ కార్మికుల వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బూడిది గోపాలకృష్ణ నేతృత్వంలో బ్రాంచ్ మేనేజర్ శ్రీ అజ్మీర వీరన్న గారికి వినతి అందించారు. 30-40 సంవత్సరాల పాటు సింగరేణిలో సేవలందించిన కార్మికులకు ప్రస్తుతం అందుతున్న పెన్షన్ పథకాలతో పాటు, అదనంగా సమగ్ర పెన్షన్ ప్యాకేజీని కల్పించాలని వారు కోరారు.
ఈ ప్యాకేజీలో భాగంగా ఉచిత వ్యక్తిగత ప్రమాద బీమా, తక్కువ ప్రీమియంతో ఆరోగ్య బీమా, ఫిక్స్డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ, బ్యాంకింగ్ సేవలపై సర్వీస్ ఛార్జీల మినహాయింపు, ఉచిత డెబిట్ కార్డులు, తక్కువ వడ్డీతో వ్యక్తిగత రుణాలు, వృద్ధులకు డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలు, ప్రత్యేక హెల్ప్ డెస్క్ సేవలు వంటి అంశాలు ఉండాలని అసోసియేషన్ ప్రతినిధులు సూచించారు. ఈ పథకాలు సుమారు 40 నుండి 60 వేల మంది కార్మికులకు ఆర్థిక భద్రత కల్పిస్తాయని తెలిపారు.
ఎస్బీఐ మేనేజర్ శ్రీ అజ్మీర వీరన్న, అసోసియేషన్ ప్రతినిధుల వినతిని సానుకూలంగా స్వీకరించి, సమస్యలను పై అధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా, బ్యాంకులో ఖాతాలు తెరవాలని, వివిధ రకాల లోన్లు, ఇన్సూరెన్స్ పాలసీలను ఉపయోగించుకోవాలని కార్మికులకు సూచించారు. 60-70 ఏళ్ల మధ్య వయసు వారికి 30 లక్షల రూపాయల ఉచిత యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అందిస్తున్నట్లు తెలిపారు.












