రామగుండం, 31-07-2026
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల, పెద్దపల్లి జోన్లలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై, అలాగే అనుమతి లేని డ్రోన్లు, డీజే సౌండ్ సిస్టమ్ల వినియోగంపై నిషేధాజ్ఞలను కొనసాగిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. ప్రజల భద్రత, అసౌకర్యాన్ని నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ఆంక్షలు ఆగస్టు 1 నుండి సెప్టెంబర్ 1 వరకు అమలులో ఉంటాయి.
సాధారణ ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని, రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల, పెద్దపల్లి జోన్లలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను కొనసాగిస్తున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి కొందరు వ్యక్తులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే పలు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
మద్యం మత్తులో వీధులు, రహదారులపై అసభ్య పదజాలంతో ప్రవర్తించడం వల్ల ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిషేధాజ్ఞలు విధించినట్లు తెలిపారు. ఈ నిషేధాజ్ఞలు 01-08-2026 నుండి 01-09-2026 వరకు అమల్లో ఉంటాయని, పరిస్థితులను బట్టి వీటి కాలపరిమితిని పొడిగించే అవకాశం ఉందని తెలిపారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 223, హైదరాబాద్ నగర పోలీస్ చట్టం, 1348 ఫసలీ నిబంధనల ప్రకారం ఈ నిషేధాజ్ఞలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల, పెద్దపల్లి జోన్లలో డీజే సౌండ్ సిస్టమ్ల వినియోగంపై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను కూడా పొడిగించినట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, రోగులు, విద్యార్థుల విద్యాభ్యాసానికి ఎలాంటి అంతరాయం కలగకుండా, శబ్ద కాలుష్యాన్ని నివారించేందుకు అధిక శబ్దంతో కూడిన డీజే సౌండ్ సిస్టమ్ల వినియోగంపై నిషేధం విధించినట్లు తెలిపారు. వివిధ కార్యక్రమాల సందర్భంగా ప్రజలను సమీకరించేందుకు డీజే సౌండ్ సిస్టమ్లను వినియోగిస్తున్నట్లు గమనించామని పేర్కొన్నారు.
అయితే, కార్యక్రమాల నిర్వహణకు మైక్ సెట్ అవసరమైతే సంబంధిత డివిజన్ ఏసీపీ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. మైక్ సెట్ వినియోగానికి సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. ఈ నిషేధాజ్ఞలు కూడా 01-08-2026 నుండి 01-09-2026 వరకు అమల్లో ఉంటాయని, పరిస్థితులను బట్టి కాలపరిమితిని పొడిగించే అవకాశం ఉందని తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 223, హైదరాబాద్ నగర పోలీస్ చట్టం, 1348 ఫసలీ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్లలో రామగుండం కమిషనరేట్ చట్టం–2016లోని సెక్షన్ 7(1), సెక్షన్ 22(1)(a) నుండి (f), సెక్షన్ 22(2)(a), (b), సెక్షన్ 22(3), హైదరాబాద్ సిటీ పోలీస్ చట్టం, 1348 ఫసలీలోని సెక్షన్ 30, పోలీస్ చట్టం–1861 నిబంధనల మేరకు 01-08-2026 ఉదయం 6.00 గంటల నుండి 01-09-2026 ఉదయం 6.00 గంటల వరకు నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ కాలంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించాలనుకుంటే ముందుగా సంబంధిత పోలీస్ అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.










