జైపూర్ ఎస్టీపీపీ (STPP) ప్రాంగణంలో నిర్మిస్తున్న 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ స్థలంలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లపై, కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా వాహనాలు నడపాలని ఒత్తిడి తేవడంతో కాంక్రీట్ మిల్లర్ లారీ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడగా, అతని చేయి విరిగిపోయింది.
గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్లాంట్ లోపలి రోడ్ల పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారింది. వాహనాలు నడిపేందుకు ఏమాత్రం వీలులేని పరిస్థితి ఉన్నప్పటికీ, పవర్ మెక్ (Power Mech) కంపెనీ వెహికల్ ఇన్ఛార్జ్ డ్రైవర్లను తీవ్ర ఒత్తిడికి గురిచేసినట్లు బాధితులు, తోటి కార్మికులు ఆరోపిస్తున్నారు. 'రోడ్డు సరిగా లేదని, ప్రమాదం జరిగే అవకాశం ఉందని మొరపెట్టుకున్నా వినకుండా.. కచ్చితంగా విధులకు వెళ్లాల్సిందేనంటూ వెహికల్ ఇన్ఛార్జ్ హుకుం జారీ చేశారు. అతని బాధ్యతారాహిత్యం వల్లనే ఈరోజు ఒక పేద డ్రైవర్ చేతికి తీవ్ర గాయమై ఆసుపత్రి పాలయ్యాడు' అని తోటి కార్మికులు తెలిపారు.
ప్రమాదం తెలిసిన వెంటనే తోటి కార్మికులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన డ్రైవర్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్లాంట్లో కనీస సేఫ్టీ నిబంధనలు గాలికి వదిలేసి, కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పవర్ మెక్ కంపెనీ యాజమాన్యం మరియు సదరు వెహికల్ ఇన్ఛార్జ్పై వెంటనే చట్టరీత్యా తగిన చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాలు, ప్రాజెక్టు కార్మికులు తీవ్రస్థాయిలో డిమాండ్ చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోకపోతే పనులు బంద్ చేసి నిరసన తెలుపుతామని హెచ్చరించారు.












