మంచేరియల్, 08-07-2026
ప్రజల భద్రత, నేరాల నియంత్రణ, సురక్షిత రవాణా లక్ష్యంగా బెల్లంపల్లి పట్టణంలో అధికారులు బుధవారం సాయంత్రం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వ్యాపార సంస్థల యజమానులకు సీసీ కెమెరాల ప్రాముఖ్యతను, ట్రాఫిక్ నిబంధనల ఆవశ్యకతను వివరించారు.
ప్రజల భద్రత, నేరాల నియంత్రణ, సురక్షిత రవాణా లక్ష్యంగా బెల్లంపల్లి పట్టణంలో అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బుధవారం సాయంత్రం 5.00 గంటల నుంచి 7.00 గంటల వరకు కాంటా చౌరస్తా నుంచి ఓల్డ్ బస్టాండ్ వరకు అధికారులు కాలినడకన పర్యటిస్తూ వ్యాపార సంస్థల యజమానులను కలిసి ఈ కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా వ్యాపార సంస్థల యజమానులు తమ దుకాణాల వద్ద నాణ్యమైన సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాల ద్వారా నేరాల నివారణ, నేరస్తుల గుర్తింపు, వ్యాపార సంస్థల భద్రత మరింత బలోపేతం అవుతుందని వివరించారు.
అదే విధంగా ట్రాఫిక్ నిబంధనల పాటింపు, రహదారి భద్రత, వాహనదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. బెల్లంపల్లి పట్టణంలోని యూ-టర్న్ల వద్ద వాహనాలను ట్రాఫిక్ నిబంధనలకు అనుగుణంగా నడపాలని, నిర్లక్ష్యంగా వాహనాలు నడపకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
ప్రజల సహకారంతోనే సురక్షిత, నేరరహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని అధికారులు పేర్కొన్నారు. ప్రతి వ్యాపార సంస్థలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం, ప్రతి పౌరుడు ట్రాఫిక్ నిబంధనలను పాటించడం సామాజిక బాధ్యతగా స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మనోజ్, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్, బెల్లంపల్లి వన్టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రావు, బెల్లంపల్లి రూరల్ సీఐ హనోక్, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్పర్సన్ దావా స్వాతి, బెల్లంపల్లి టూ టౌన్ ఎస్ఐ, తాండూర్ ఎస్ఐతో పాటు పోలీసు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.












