అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సంస్కృతి, సాహిత్యం తో పాటు దేశ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచ వ్యాప్తం చేయడానికి, వివిధ రాష్ట్రాల ప్రతిభావంతుల ప్రతిభను వెలుగులోకి తీసుకురావడానికి తెలుగు సంస్కృతి సాహితీ సేవా ట్రస్ట్, తెలంగాణ సంస్కృతి సాహితీ బుక్ ఆఫ్ రికార్డ్స్ కృషి చేస్తున్నాయని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ మాచవరం గౌరీ శంకర్ తెలిపారు. ఈ నేపథ్యంలో రవీంద్రభారతిలో వివిధ రంగాల ప్రముఖులకు అవార్డుల ప్రదానం జరిగింది.
అంతర్జాతీయ సేవా సంస్థ అయిన తెలుగు సంస్కృతి సాహితి సేవా ట్రస్ట్, తెలంగాణ సంస్కృతి సాహితీ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ఆదివారం ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలలో విశేష కృషి చేసిన వారిని పలు పురస్కారాలతో ఘనంగా సత్కరించారు. ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ మాచవరం గౌరీశంకర్ అధ్యక్షత వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిరిసిల్ల డిఎస్పీ నాగేంద్ర చారీ కత్రోజు, దైవజ్ఞ శర్మ, సూరేపల్లి విజయ ల తో పాటు స్వరవాహిని విద్యా మందిర్ సంగీత శిక్షణాలయం చైర్మన్ సిహెచ్ ప్రసన్న లక్ష్మీ, శ్రీ లలిత నృత్యాలయం చైర్మన్ ఎం లలిత, సాఫ్ట్వేర్ రంగానికి చెందిన రంగ ప్రసన్న కుమారి, మువ్వ డ్యాన్స్ అకాడమీ కొండ్ర రమాదేవి, సన్నమూరి శ్రీనివాస్, రచయిత తూముల మణికోట రాజశేఖర్, గాయకులు కుందారం సంజయ్, జై భీమ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు జి ఉమాదేవి, జై భీమ్ పార్టీ లీగల్ అడ్వైజర్ మంజుల పూజారి, మాచవరం నరసింహ సాయి శ్రీనివాస్, దీపక్ లు హాజరయ్యారు.
అతిథులు అవార్డు గ్రహీతలకు పురస్కారాలు అందజేసి, శాలువాతో సన్మానించి, జ్ఞాపికలు అందజేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వివిధ రంగాల ప్రతిభావంతులకు ఈ పురస్కారాలు లభించాయి. ముఖ్యంగా, జర్నలిస్ట్ విభాగంలో పబ్లిక్ టివి జర్నలిస్ట్ గరిగే సుమన్ ను జాతీయ పురస్కారంతో సత్కరించారు.
ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ, తెలుగు సంస్కృతి సాహితీ సేవా ట్రస్ట్ నిర్వహిస్తున్న కార్యక్రమాలను ప్రశంసించారు. తెలుగు సంస్కృతి, సాహిత్యాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రోత్సహించడంలో ఈ సంస్థ చేస్తున్న కృషిని అభినందించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.











